రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై నేటి మధ్యహ్నం మూడు గంటలకు ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆన్లైన్ ద్వారా భేటీ కానున్నది.
అధికార పార్టీ ఎన్నికల కమిషనర్ పై సభాహక్కుల ఉల్లంఘన చట్టాన్ని ప్రయోగించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నది. తమపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పరిశీలించిన తమ్మినేని తదుపరి చర్యలు ప్రారంభించారు. రూల్ నెం 173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని ప్రతిపాదించారు. స్పీకర్ నిర్ణయం మేరకు నేటి మధ్యహ్నం మూడు గంటలకు ఆన్లైన్ వర్చ్యువల్ విధానం ద్వారా ప్రత్యేకంగా భేటీ అయి SEC వ్యవహారంపై చర్చించనున్నారు.
ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అందులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి సహా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని నిమ్మగడ్డ తన లేఖలో ఆరోపించారు. మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు లక్ష్మణ రేఖ (ఎన్నికల కోడ్) దాడి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని నిమ్మగడ్డ విమర్శించారు.
ఈ లేఖ పై స్పందించిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స… సీనియర్ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా బాధ్యతాయుతమై పదవుల్లో ఉన్న తమ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా తమ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఎస్ఈసీ రాసిన గవర్నర్ కు రాసిన లేఖలో వేసిన నిందలు, ఆరోపణలు తమకు మానసికంగా వేదన కలిగించాయని, బాధించాయని. నిమ్మగడ్డ చేసిన అసత్యారోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ గౌరవానికి భంగం కలిగిందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.