రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. 53వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు అవసరం అవుతాయని, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అననారు.
అందుకోసమే అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, అసెంబ్లీ ఉంటాయని, కర్నూలులో హైకోర్టు పెట్టవచ్చని అదే విధంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొచ్చని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మూడు క్యాపిటల్ సిటీలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. వారం రోజల్లో నిపుణుల కమిటీ నివేదిక రానుందని పేర్కొన్నారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని డిసైడ్ చేశారు.. ఆయన లెక్క ప్రకారం 53వేల ఎకరాల్లో కట్టాలంటే.. ఎకరాకు మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు అయితే.. మొత్తం లక్షా 9 వేల కోట్లు అని తేల్చాడు. అయితే గత 5 ఏళ్ళలో రూ.5,800 కోట్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టాడు.
రాజధాని బాండ్స్ పేరుతో 10.35 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ఇప్పటి వరకూ రాజధాని పేరుతో తెచ్చిన అప్పులకు దాదాపు వడ్డీనే రూ. 700 కోట్లు ప్రతి ఏటా కట్టాలి. రాజధానిలో ఇప్పటివరకూ 5 వేల కోట్లు ఖర్చు పెడితే.. మిగతా లక్ష కోట్ల డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. వాటికి వడ్డీ ఎంత అవుతుంది. వడ్డీ అయినా కట్టే పరిస్థితి ఉందా.
నాకు కూడా కట్టాలనే ఉంది. కానీ, లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి.. ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఉంది అని ఆయన అన్నారు.