ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో బాటు, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ ల పేర్లను నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. వీరిద్దరికీ సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సూచించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజా ప్రతిపాదనలకు ఆమోద ముద్రపడితే సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 34కి పెరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎమ్మార్ షా, దినేశ్ మహేశ్వరి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆ రెండు స్థానాలను భర్తీ చేయడానికి కొలీజియం ఈ సిఫారసులను చేసింది.
కేంద్రం ఆమోదించి విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే, సీనియారిటీ ప్రకారం ఆయన 2030లో సీజేఐ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవిలో 2031 మే 25 వరకు కొనసాగుతారు.