వచ్చే నెల నుంచి అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే తీసుకెళ్లి అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు కింద పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్గ్రిడ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను గుర్తించాలని సీఎం ఆదేశించారు. అర్హులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని..వీటి ద్వారా మరో 3వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు జగన్ చెప్పారు. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున వ్యవసాయరంగంలో పనులు లభిస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
మార్చి నాటికి అనుకున్న పనిదినాలతో లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ఉపాధిహామీ నిధుల వినియోగంలో లక్ష్యాలను చేరుకుంటున్నామని వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం అన్నారు. ఆ తర్వాత మినీ గొడౌన్ల నిర్మాణంపైనా దృష్టి సారించాలన్నారు. పాఠశాలల ప్రహరీగోడలను ఉపాధిహామీ నిధులతో నిర్మించాలని ఆయన ఆదేశించారు.