ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా అంకిత భావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే ఆశించిన రీతిలో పనితీరు కనిపించడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించారు.
ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని సీఎం అన్నారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని, లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని ఆయన అన్నారు. అవినీతి నిరోధానికి 14400 కాల్సెంటర్ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలని, ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆయన అన్నారు. సెలవుల్లేకుండా పనిచేయండి, మూడు నెలల్లోగా నాకు మార్పు కనిపించాలి, కావాల్సినంత సిబ్బందిని తీసుకోండి, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మరో నెలరోజుల్లో సమీక్ష చేస్తా అని ఆయన అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఇతర అధికారులు ఉన్నారు.