ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సిఎం ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. కడప జిల్లాకు చెందిన అంజాద్ బాషాకు కరోనా పాజిటీవ్ రావడంతో ఒక్క సారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. కరోనా వ్యాప్తిలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, వారి వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే ఈ సారి నేరుగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే కరోనా పాజిటీవ్ రావడం గమనార్హం.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ను హొం క్వారంటైన్ లో ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారు. దాంతో 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహ నిర్బంధంలో ఉంటారు.
తర్వాత మరో మారు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. సీఎం జగన్ కడప జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు, నేతలకు, పాత్రికేయులకు కరోనా టెస్ట్ లు నిర్వహించగా డిప్యూటీ సీఎంకు కరోనా విషయం బయటకు వచ్చింది. కొద్ది కాలం కిందట అంజాద్ బాషా కుటుంబ సభ్యులు మర్కజ్ వెళ్లి వచ్చారని వారికి కరోనా వచ్చిందని వార్తలు వెలువడ్డాయి.
వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారని కూడా అన్నారు. ఆ వార్తలను డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. అలా వార్తలు రాసిన పత్రికలు, ప్రసారం చేసిన మీడియా పై పరువునష్టం దావా వేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు కరోనా వచ్చినట్లు అధికారికంగానే ప్రకటించారు.