మతిస్థిమితం లేని ఓ మహిళ పట్ల కరుణ చూపి సపర్యలు చేశారు నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్, కంచికచర్ల మహిళా ఎస్సై శ్రీ లక్ష్మి, మహిళా కానిస్టేబుళ్లు. ఈరోజు ఉదయం కంచికచర్ల టౌన్ చెవిటికల్లు సెంటర్లో 30 ఏళ్ల వయసు గల మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ విషయం పోలీసులకు తెలిసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ బట్టలు లేకుండా సంచరిస్తున్నట్లు తెలుసుకున్న సిఐ నాగేంద్ర కుమార్, కంచికచర్ల ఎస్సై శ్రీ లక్ష్మీ మహిళా పోలీసు సిబ్బందితో కలసి వెను వెంటనే ఆ మహిళ వద్దకు వెళ్లారు. సబ్బులు, షాంపూలు తీసుకొని వచ్చి తల స్నానం చేయించి, పిచ్చిగా తిరిగే మనిషిని కొత్త వస్త్రాలు ధరించి మామూలు మనిషిగా తయారుచేశారు. ఆమెకు కావలసిన ఆహారాన్ని అందించారు. పోలీసులు సమాజ సేవ చేయడం చూసి కంచికచర్ల టౌన్ ప్రజలు ఆనందం వ్యక్త పరిచారు. త్వరలో ఆమె కుటుంబాన్ని గుర్తించి, ఆమెను వాళ్ల కుటుంబానికి అప్పజెప్పడానికి పలు ప్రయత్నాలు చేసి ఆమె అప్పగిస్తామని సిఐ నాగేంద్ర కుమార్ చెప్పారు.