ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలలో ఒక దానికి మాజీ ప్రధాని పి వి నరసింహారావు పేరు పెట్టాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. బహుబాషా కోవిదుడు, అపర చాణక్యుడు, భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అనేక రంగాల్లో విశేష సేవలందించారని అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 25 జిల్లాల్లో ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే మనం ఆయనకిచ్చే గౌరవం అని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంఘం తరపున అన్నారు. కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టిన ఘనడు పివి నరసింహారావు అని ఆయన అన్నారు.
విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకమని, తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపించజేశారని ఆయన అన్నారు. పీవీ తెలుగువాడిగా పుట్టడం మనందరికీ గర్వకారణమని, ఆయన జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని బుచ్చిరాం ప్రసాద్ అన్నారు.
పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడంతో పాటు ఆయన దేశానికి చేసిన సేవలను భావి తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.