కరోనా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. మొత్తం 20 మంది ఖైదీలకు కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.
వారికి చికిత్స జరుగుతున్న సమయంలో నలుగురు ఖైదీలు మాత్రం గాంధీ నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుండగానే అబ్దుల్ అర్బాజ్, జావీద్, సోమ సుందర్, నరసయ్య అనే నలుగురు ఖైదీలు గాంధీ నుంచి తప్పించుకున్నారు.
గాంధీ ఆసుపత్రి రెండో అంతస్తులో చికిత్స పొందుతున్న వీరు కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్ షీట్ల నుంచి కిందకు దిగారు. అక్కడ నుంచి పరారయ్యారు. సీసీ టీవీలు పని చేయకపోవడంతో దృశ్యాలు రికార్డు కాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని ఖైదీలను పట్టుకోవడం కోసం రెండు బృందాలను నియమించారు.
పారిపోయిన ఈ ఖైదీలలో నరసయ్య అనే ఖైదీ 2011లో కూడా ఒక సారి పారిపోయాడు.