రాష్ట్ర హైకోర్టు పలు మార్లు చెప్పినా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని కోర్టు వ్యాఖ్యానించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించమని ఇప్పటికే చెప్పినప్పటికీ.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని న్యాయస్థానం తప్పుబట్టింది. కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని తమ వద్ద బకాయిలు లేవని అఫిడవిట్లో చెప్పిందని కోర్టు పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బురాలేదని చెబుతోందని, ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.