అమరావతి భూముల కుంభకోణం విషయంలో ఏపీ సీబీసిఐడి ఇచ్చిన నోటీసుల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడికి ఊరట లభించింది.
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా,తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును కోరారు. వాదనతో ఏకీభవించిన హైకోర్టు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు,నారాయణపై కేసులో ఆధారాలు చూపించాలని న్యాయమూర్తి సీఐడీని అడిగారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులను ప్రశ్నించారు.
విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ చెప్పుకొచ్చింది. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొంది.