జెడ్.పి.టి.సి.,ఎం.పి.టి.సి.ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ (ఎస్.ఇ.సి.) తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరనసనగా శుక్రవారం ఎస్.ఇ.సి. నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.
రెండో తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసాము, ఆ సమావేశానికి రావలసిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్.ఇ.సి. రాత్రి అయ్యేసరికి ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని, ఈ నెల 8 న పోలింగ్, 10 న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా జనసేన భావిస్తోందని ఆయన తెలిపారు.
ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాక ముందే ఎస్.ఇ.సి. ఇటువంటి దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.
ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన భావిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.