ఏ.ఆర్ సిబ్బంది మానవత్వంతో నిరుపేదలు, నిరాశ్రయులను ఆదుకునేందుకు నిత్యావసరాలు, కూరగాయలు అందచేయడం అభినందనీయమని కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా ఎస్.పి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని 1998 బ్యాచ్ ఏ.పి.ఎస్.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.ఆర్.పి సి. వై.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ లు అందరూ సంఘటితంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే వాహనాన్ని జెండా ఊపి జిల్లా ఎస్.పి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ మాట్లాడుతూ ఓ వైపు కరోనా కట్టడికి నిరంతరం విధుల్లో ఉంటూనే మరోవైపు మానవతా దృక్పధంతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. 1998 బ్యాచ్ ఏ.పి.ఎస్.పి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై.జగన్ మోహన్ రెడ్డి(మైదుకూరు ఎం.ఎల్.ఏ. గన్ మెన్, ఏ.ఆర్.పి.సి 3199) మాట్లాడుతూ నగరంలోని నిరుపేదలకు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఇందులో బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు ఉంటాయన్నారు. తమ అసోసియేషన్ లోని 150 మంది కలిసి విరాళాలు పోగు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవునికడప, వాటర్ గండి, శ్రీ వెంకటేశ్వర ఎస్.టి కాలనీ, ప్రకాష్ నగర్ లోని పేదలకు వీటిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి రిషికేశవ రెడ్డి, ఆర్.ఐ లు జావేద్, మహబూబ్ బాషా, ఎస్.బి సి.ఐ లు వెంకట కుమార్, పుల్లయ్య, రామచంద్ర ఎస్.బి ఎస్.ఐ వెంకటేశు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు దూలం సురేష్, 1998 బ్యాచ్ ఏ.పి.ఎస్.పి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.