కాపు నేస్తం పథకం ద్వారా కాపు సామాజిక వర్గానికి ఎంతో చేస్తామని వైకాపా గొప్పలు చెప్పుకుంటుందని టిడిపి సీనియర్ నాయకులు,నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ కింద కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి రూ.4500 కోట్లు ఇచ్చామని, ఇంతే కాకుండా మరో రూ.1000 కోట్లతో వారి అభివృద్ధికి,సంక్షేమానికి ఖర్చు చేశామని తెలిపారు.
ప్రస్తుతం రైతు భరోసా కింద కాపులకు వైకాపా ప్రభుత్వం రూ.1945 కోట్లు మాత్రమే ఇస్తుందని తెలిపారు. మరో వైపు కాపు నేస్తం అంటూ ఆ సామాజికవర్గం మహిళలకు ఇస్తున్నదే రూ.354 కోట్లు మాత్రమేనని దీనిలో కూడా 10 శాతం మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి రూ.400 కోట్లు కేటాయించి, రూ 4000 కోట్లు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని డాక్టర్ చదలవాడ ధ్వజమెత్తారు.
కాపు రిజర్వేషన్లు 5 శాతం ఉండగా వాటిని రద్దు చేసింది వాస్తవం కాదా ? అని ఆయన నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల మంది కాపులు ఉన్నట్లుగా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారని ,ఈ ప్రకారం ఆ సామాజిక వర్గం మహిళల సంఖ్య 50 లక్షలు ఉంటుందన్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది కాపు నేస్తం పథకానికి అర్హులు ఉండగా అర్హుల సంఖ్యను 2.35 లక్షలకు కుదించారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అనేక హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని హితవు పలికారు.