అమరావతి కోసం ఉద్యమిస్తున్న దేవినేని ఉమా విజయవాడ గద్దె రామ్మోహన్ దీక్ష కు నిమ్మరసం ఇచ్చేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వెళ్తుండగా పోలీసులు ఆయన బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవినేని ఉమాను ఇంటి నుండి బయటకు తీసుకువచ్చారు.
ఇంటి వద్ద నుండి గొల్లపూడి లోని దీక్షా స్థలి వద్దకు వచ్చిన దేవినేని మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలను ఆపలేరని రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న వారిని నిరంకుశంగా నిర్వహిస్తూ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి కేసులో ముద్దాయిగా కోర్టులలో చేతులు చేతులు కట్టుకుని చేయడం సిగ్గు చేటు అని, ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తలవంపులుగా తలెత్తుకోలేని విధంగా ఉందని దేవినేని అన్నారు.
స్వాతంత్ర సమరం కోసమో.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమో.. ప్రజా హక్కుల పోరాటం కోసమో ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్తే గొప్పగా చెప్పుకుంటాం కానీ అవినీతి కేసుల్లో వెళ్తుoటే సమాజానికి ఏ సందేశం ఇస్తున్నట్లు చెప్పాలని దేవినేని అన్నారు.
అమరావతి 29 గ్రామాల సమస్య కాదని ఐదు కోట్ల ఆంధ్రుల ప్రజల సమస్యని అటువంటి ఉద్యమాన్ని అణచివేయాలని అనాలోచిత నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని దీనికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారు అని దేవినేని అన్నారు. అమరావతి కోసం ఉద్యమిస్తుంటే ఇప్పటికే నాలుగు కేసులు నాపై పెట్టారని, అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారని ఈ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు.
ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని దేవినేని పునరుద్ఘాటించారు. పోలీసుల సంఖ్య పెంచి తాళాలువేసి తాళ్ళు కట్టి ఉద్యమాలను ఆపలేరని ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న తమకు సహకరించాలని అక్రమ అరెస్టులను ఆపాలని దేవినేని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.