కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయిన అశోక్ గజపతి రాజు విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో మారు భంగపాటుకు గురైంది.
అశోక్ గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం, అర్ధరాత్రి ఉత్తర్వులతో సింహాచల దేవస్థానం చైర్మన్గా తొలగించింది. అలాగే… విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది.
ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది. సంచయిత నియామకంపై పలు ధార్మిక సంస్థలు అప్పటిలో తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెచ్ కొట్టివేసింది. అశోక్గజపతిరాజును పునర్ నియమిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై జగన్ ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది. మాన్సాస్ చైర్మన్గా అశోక్గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీన్ని నిలుపుదల చేసేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కేసుసు డిసెంబర్ కు పోస్టు చేసింది.