తనను అత్యంత హేయమైన పదంతో తిట్టినా కూడా సంస్కారవంతుడైన సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఈ మంత్రి హయాంలో హిందూధర్మం నిలబడే పరిస్థితి లేదని అందువల్ల ప్రజలే ముందుకు వచ్చి హిందూ మతాన్ని కాపాడుకోవాలని పూసపాటి అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు.
రాముడి తల తీసేసిన రామతీర్ధంపై చెలరేగుతున్న వివాదం కారణంగా మంత్రి వెల్లంపల్లి అత్యంత అసభ్యకరమైన పదాన్ని అశోక్ గజపతి రాజును ఉద్దేశించి మాట్లాడారు. రామతీర్ధం దేవస్థానం అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి నుంచి ఆయనను అత్యంత అవమానకర పరిస్థితుల్లో తొలగించింది.
ఈ సందర్భంగా ఉచ్ఛంనీచం మరచిన మంత్రి వెల్లంపల్లి వయసును, అత్యంత గౌరవప్రదమైన క్షత్రియ కులానికి చెందిన, అత్యంత నిజాయితీ పరుడు, వితరణ శీలి అయిన అశోక్ గజపతి రాజును అనరాని మాట అన్నారు. అయినా అశోక్ గజపతి రాజు ఏ మాత్రం సంయమనం కోల్పోలేదు.
ఇలాంటి మాటలు అనేది కేవలం మన దృష్టిని మరల్చడానికే అని ఆయన వ్యాఖ్యానించారు. దృష్టిని మరల్చి హిందూ మతానికి అన్యాయం చేయడమే వారి ఉద్దేశ్యమని అశోక్ గజపతి రాజు అన్నారు.
అందువల్ల హిందువులు అందరూ రెచ్చగొట్టే ఈ మాటలను పట్టించుకోకుండా హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పిలుపునిచ్చారు.