విశ్వసనీయత లేని సీఐడీకి రామతీర్థం ఘటన దర్యాప్తును అప్పగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీ సీఐడీ ఆధ్వర్యంలో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు ప్రభుత్వం ఎంత చెప్తే అంత మాత్రమే చేస్తారని వ్యాఖ్యానించారు. సీఎంఓలో అవినాష్ అనే వ్యక్తి ఏం చెప్తే అది సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేస్తారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ విషయంలో ఇదే రుజువైందన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయని సీఐడీ రామతీర్థం విషయంలో సక్రమంగా దర్యాప్తు చేస్తుందా అని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేసినా, షేర్ చేసినా కేసులు నమోదు చేస్తారని, కోర్టు ఆదేశాలనే పట్టించుకోలేదన్నారు.
చివరికి సీబీ సీఐడీ చీఫ్ కు సునీల్ కుమార్ అర్హులు కాదంటూ స్వయంగా కోర్టులే వ్యాఖ్యానించాయన్నారు. ఒకసారి కోర్టు చేత చీవాట్లు తిన్న వ్యక్తి హిందూ ఆలయాలపై ఎలా దర్యాప్తు చేస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇక సీబీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ క్రైస్తవుడని, ముఖ్యమంత్రి, హోమంత్రి, డీజీపీది కూడా అదే మతం అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.