స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళిత వర్గాలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో కొందరు దళిత మహిళను వివస్త్రను చేసి పాశవిక దాడికి పాల్పడిన ఘటనపై ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పందించారు. శనివారం ఆయన కామారెడ్డికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డిఎస్పీ ప్రకాష్ తో మాట్లాడారు. అక్కడినుంచి రామారెడ్డి రోడ్డులో గల సఖి కేంద్రంలో ఉన్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దాడి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.
ఈ ఘటనను కమిషన్ ఖండిస్తుందన్నారు. ఈ దాడి దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారని, ఈ కేసులో మిగతా వారి ప్రమేయంపై పూర్తి విచారణ జరిపి శిక్షించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. తమ కమిషన్ ద్వారా బాధిత మహిళకు ఉపాధి కల్పించాలని కోరుతామన్నారు. బాధిత మహిళకు ఎస్సి,ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో దళిత, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి