అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో, చైల్డ్ లైన్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో శాయంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘బాల్య వివాహంవల్ల కలిగే నష్టాలు, విద్య వలన లాభాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అను అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సీడబ్ల్యుసి చైర్ పర్సన్ డా.కె.అనితారెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా జీవితాన్ని కోల్పోతారని, విద్యకు దూరం అయి అభివృద్ధికి దూరం అవుతారని, శారీరక, మానసికంగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు.
బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరం అని అన్నారు. వాటిని ప్రోత్సహించినవారు శిక్షార్హులు అవుతారని అన్నారు. అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై పిల్లలకు సున్నితంగా తెలియచేయవలసిన అవసరం తల్లిదండ్రులకు, టీచర్సకు ఉందని అన్నారు. బయటివారే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా స్వప్రయోజనాల కోసం పిల్లలకు ఇష్టం లేకుండా తాకినా కూడా శిక్షార్తులేనని అన్నారు. పిల్లలు మౌనంగా ఉండకూడదని, పిల్లలకి ఇబ్బందులు కలిగించేవారిపైన 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు.