40.2 C
Hyderabad
April 29, 2024 18: 18 PM
Slider ప్రత్యేకం

లిక్కర్ కేసులో సీఎం కేసీఆర్ బిడ్డ అరెస్ట్ ఖాయం

#bandisainjai

లిక్కర్ స్కాంలో తన బిడ్డ అరెస్ట్ కాబోతుందనే పక్కా సమాచారం రావడంతో భయపడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగానే ‘‘నేనింతే  నా బతుకింతే’’ పేరుతో తన సొంత కథ-స్ర్కీన్ ప్లే-డైరెక్షన్ లో రూపొందించిన సినిమాను ప్రగతి భవన్ లో చూపించి నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.

అయితే ఆ సినిమాలో కొత్తదనమేదీ లేదని, జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా లిక్కర్ స్కాంలో ఆయన బిడ్డను కాపాడలేరని అన్నారు. ఇప్పటికే ఒకసారి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీస్ లని, వారిని హీరోలుగా చూపుతూ చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, సీహెచ్.విఠల్, జె.సంగప్ప తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

అందులోని ముఖ్యాంశాలు…

‘‘నేనింతే – నా బతుకింతే’’ సినిమా. చిన్నప్పటి కథ ఆవు-మేత గుర్తొకొస్తుంది.  కేసీఆర్ నిన్న చూపిన సినిమా చూస్తే అట్లనే ఉంది. అదో పెద్ద డ్రామా. తెలంగాణ సమాజానికి అర్ధమైంది. కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నడు. ఎందుకు భయపడుతున్నాడని చర్చ జరుగుతోంది. దీనికి కారణం బిడ్డ లిక్కర్ కేసు. పూర్తిగా ఇరక్కపోయింది. ఆమె పరిస్థితి ఏమిటనే దానిపై టెన్షన్. అందుకే సీబీఐ రాకుండా జీవో విడుదల. కేసీఆర్… కేసు బుక్ అయ్యింది ఢిల్లీలో. అక్కడి సీబీఐ ఊరుకుంటదా? వాళ్లు ఏ క్షణమైనా రావొచ్చు.. ఎంక్వైరీ జరగొచ్చు. అరెస్ట్ చేసి తీసుకెళ్లవచ్చు. ఇది తెలిసే ఈ కేసును డైవర్ట్ చేయాలనుకున్నడు. 

ఇన్నాళ్లు దేశంలో నాయకులెవరూ నమ్మడం లేదు. రైతు సంఘాలతో మీటింగ్ పెట్టినా, అన్ని రాష్ట్రాలకు పోయినా పట్టించుకోలేదు. అందుకే  కేసీఆర్ ఫాంహౌజ్ లో స్క్రిప్ట్ రాసుకున్నడు.  ఢిల్లీకి పోయి ఆర్టిస్టులను రడీ చేసుకున్నడు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చి సీఎస్, డీజీపీ, సీపీలను పిలిపించుకుని ఈ స్క్రిప్ట్ చదివించిండు… ఇది చేస్తేనే మనం బయటపడతం.. లేకుంటే నా బిడ్డ అవుట్ అయితదని చెప్పి.. ఏ టైంలో ఏం జరగాలో చెప్పిండు… అక్టోబర్ 26న ముహూర్తం స్టార్ట్ అయ్యింది. ఉదయం 11.30 గంటలకు ఓ ఆణిముత్యం (విచిత్ర సోదరుల లెక్క ఉన్నడు..) పోలీసులకు ఫిర్యాదు చేసిండట.. వెంటనే 12.30 గంటలకు లోకేషన్ ఆర్టిస్టులు సీపీ పోలీసులు వచ్చారు.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫిక్స్ చేసిండ్రు. 3.15 గంటలకు నకిలీ ఆణిముత్యాలు వచ్చినయ్. సినిమా స్టార్ట్ అయ్యింది. మొత్తం 4 గంటలకు పైగా సినిమా రికార్డ్ అయ్యింది. ఆ లెక్కన 7 గంటల 28 నిమిషాల వరకు ‘‘నేనింతే – నా బతుకింతే’ సినిమా నడవాలి. ఆ తరువాత పంచనామా జరగాలే. నిందితులను, ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి. స్టేట్ మెంట్ రికార్డు చేయాలే.  కానీ నకిలీ ఆణిముత్యాలను ప్రగతి భవన్ కు… ఫేక్ గ్యాంగ్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు.  సినిమా పూర్తికాకముందే సాయంత్రం 7 గంటలకే  సీజర్ పంచనామా ఎట్లా చేస్తారు? 100 కోట్లు, 15 కోట్లు దొరికినయన్నరు…

మరి ఆ డబ్బులేవి? ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 26న ఫాంహౌజ్ లో సినిమా నడిస్తే ఇద్దరు గవాయిలను తీసుకుపోయి ముందే పంచనామా రాసిపెట్టుకుని 27 నాడు సంతకాలు తీసుకున్నరు. ఇదెట్లా? దీనినిబట్టి స్క్రిప్ట్ తోపాటు పంచనామా కూడా ప్రగతి భవన్ లోనే రడీ అయ్యింది. ఆ మరుసటి రోజే పంచనామాపై సంతకాలు తీసుకున్నరు. అమిత్ షా, మోదీ, సంతోష్ లు మాకు తెలుసనగానే… ఎట్లా నమ్ముతరు? చర్లపల్లి లో దోపిడీ దొంగలు కేసీఆర్ మాకు తెలుసన్నడు. దొంగ పాస్ పోర్ట్ కేసీఆరే ఇచ్చారని అన్నరు.. నమ్ముదామా?   నువ్వు టెక్నాలజీ లేనప్పుడే దొంగ పాస్ పోర్టు తయారు చేసిన చరిత్ర నీది.

ఇప్పుడు దొంగ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసేటోళ్ల గురువు నువ్వు..       ఆ ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ గాళ్లు మాకెందుకు? కేసీఆర్ చెప్పింది ఎట్లా ఉందంటే…. ప్రకాశ్ రాజ్ ‘‘పోకిరీ’’ సినిమా సీన్ ప్లే చేశారు) పైగా ఫాంహౌజ్ కు ఎందుకొచ్చారో ఆ ఎమ్మెల్యే గువ్వల బాలరాజే చెప్పారు (ఎన్టీవీతో చెప్పిన వీడియో ప్లే చేశారు.) తుషార్ అనేటాయనతో మాకేం సంబంధం? ఆయన బీడీజేఎస్ (భారతీయ  ధర్మ జనసేన).  కేసీఆర్ దేనికైనా తెగిస్తడు.. బిడ్డను, కుటుంబాన్ని, అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంత నీచానికైనా పాల్పడతడు.

ఇతరుల నాశనం కోరుకునే వ్యక్తి. ఎమ్మెల్యేలను అబ్జర్వ్ చేయడమే కేసీఆర్ పని. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలోకి పోతడో ఆయనకే తెల్వదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్… ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నడు సిగ్గు లేకుండా… సంతలో పశువుల్లెక 37 మందిని కొన్నవ్.. ఏమైనా అంటే అభివ్రుద్ధిని చూసి పార్టీలో చేరారని అంటున్నడు.. నిజంగా పార్టీలో చేరితే ఏం చేయాలే… పార్టీ మారితే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలే. బీజేపీ చేస్తుందదే..

మరి నువ్వేం చేసినవ్..అందరినీ కొన్నవ్ కదా… (పార్టీ మారిన జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేల ఫోటోలు ప్లే చేస్తూ..) 37 మంది ఎమ్మెల్యేల్లో ఒకాయనను కొని డైరెక్ట్ గా మంత్రి పదవిచ్చారు.. అప్పుడు టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నడంటే.. రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉండటానికి అనర్హుడు. వెంటనే బర్తరఫ్ చేయాలన్నడు..

ఆ తరువాత ఎర్రబెల్లిని కూడా కొన్నడు.. ఆనాడు తలసాని ఏమన్నడు… బిడ్డా… కేసీఆర్ చంద్రబాబు దగ్గర పాఠాలు నేర్చుకుని మాట్లాడుతున్నవా? చీమనెత్తురుందా? యాడ చదువుకుని యాడికొచ్చినవ్…. తెలంగాణ ఆణిముత్యాల్లో ఒకాయనకు బీజేపీ తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారట… మాకు కేంద్రం అపాయిట్ మెంట్ ఇవ్వదట. సిగ్గుండాలే అపాయిట్ మెంట్ ఇవ్వకుండా గడీల్లో ఉన్నదే నువ్వు.. నీకు బండి సంజయ్…కిషన్ రెడ్డి అంటే నిద్రపట్టట్లేదు.. కేసీఆర్… నిజంగా నీ దగ్గర ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? పైగా ట్విట్టర్ టిల్లు … 4గురు ఎమ్మెల్యేల కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరూ మాట్లాడొద్దన్నడు..

మరి నీ అయ్య ఎందుకు మాట్లాడిండు.. కోర్టును థిక్కరించినట్లా? కాదా? ప్రెస్ ను 10 కి.మీల లోతున పాతిపెట్టాలని చెప్పినోడు ఇయా ప్రెస్ మూల స్థంభమంటున్నడు. కోర్టు కొడతదా? అన్నోడు న్యాయ వ్యవస్థ కాపాడాలంటున్నడు.. కేసీఆర్ చేస్తున్నదంతా డ్రామా… నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హతే లేదు. నువ్వు ప్రజలనే కలవవు.. ఆర్టీఐ అప్లయ్ చేస్తే సమాధానాలివ్వవు. మాట్లాడితే కేసులు పెడుతున్నవ్? అసెంబ్లీలో మాట్లాడనీయవు. మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నవ్. తెలంగాణలో మానవ హక్కులను కాలరాస్తున్నవ్.

పేదల ఉసురు తీస్తున్నవ్. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వేల కోట్లు దోచుకుంటున్నవ్. ఒక్క లిక్కర్ కేసే కాదు.. డ్రగ్స్ కేసు, కాళేశ్వరం, నయీం డైరీ, మియాపూర్ భూముల ఫైల్స్ కూడా తీయబోతున్నరు. నువ్వు తలకిందకు కాళ్లు పైకి పెట్టినా నీ మాటలు నమ్మేవాళ్లు లేరు.  అసలు ఆ 4గురు ఎమ్మెల్యేలను మీడియా ముందుకు ఎందుకు తీసుకొచ్చి మాట్లాడనీయడం లేదు? గంప కింద ఎందకు కమ్మి పెట్టినవ్? నువ్వు మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పవు?

కొప్పుల ఈశ్వర్ చాలా మంచోడు.. అట్లాంటి దళిత మంత్రిని నిన్న ఘోరంగా అవమానించిండు (వీడియో ప్లే చేస్తూ..) నాతో ఇప్పుడు మాట్లాడితే సీఎం ఏం చేస్తరోనని భయపడుతున్నడు.. కేబినెట్ లో ఉన్న ఏకైక దళిత మంత్రి. అప్పట్లో (2014లో) కొప్పులకు ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపిండు. ఆయన మాట నమ్మి సూట్ కుట్టించుకుని కలలు కన్నడు. తెల్లారి లిస్ట్ చూసి షాక్ అయ్యిండు.. కొప్పులకు ఆనాడు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసిన మాట వాస్తవమా? కాదా? నీ కొడుకు గొడవ పెడితే ఆ పదవి ఇవ్వని మాట వాస్తవమా? కాదా? ఇట్లాంటి నీచుడు, మూర్ఖుడు కేసీఆర్ నీతి నిజాయితీగా ఉండే మోదీ, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, అమిత్ షా గురించి మాట్లాడతావా? అసలు నువ్వేంది నీ చరిత్ర ఏంది? మేం నోరు తెరిస్తే.. నువ్వు తట్టుకోలేవు?

అసలు నువ్వు లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నేను చెప్పిన ఆ 4 గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి సంబందం లేదని యాదాద్రిలో తడిబట్టలతో ప్రమాణం చేసిన. నువ్వెందుకు రాలేదు? లిక్కర్ కేసులో బిడ్డ కవిత అరెస్ట్ చేస్తే… ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ నుండి వెళ్లిపోతారని భయంతో ఈ డ్రామా ఆడి షో చేస్తున్నడు.. బీజేపీలో ఎవరు చేరినా రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరతాం. బీజేపీ సింబల్ పై పోటీ చేయిస్తాం. మరి మీరు చేస్తుందేమిటి? పోనీ ఆ 4గురిని తీసుకుంటే ప్రభుత్వం కూలుతుందా? లేదే.. ఉప ఎన్నిక జరగాలంటే… 6 నెలల్లో ఎన్నిక జరపాలె.. మరో ఏడాది గడువు ఉండాలి. .. ఆ 4గురు వ్యవహారంపై సీబీఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అడుగుతోంది మేమే.. మరి నువ్వెందుకు వద్దంటున్నవ్. ఎందుకు భయపడుతున్నవ్? నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.

Related posts

జాతీయ రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరోజే మిల్లులకు తరలించాలి

Bhavani

మరోసారి వాయిదాపడనున్న ఇంటర్‌ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment