ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అంతిమంగా ‘ప్రజా స్వామిక తెలంగాణ’ లక్ష్యంగా ఆగస్టు 9 నుండి పాదయాత్ర చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని నేడు ఆయన ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
డప్పు చప్పుళ్ళు, మేళతాళ లతో పూల వర్షం కురిపిస్తూ బండి సంజయ్ కు స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యామని, బీజేపీ ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గడీల పాలన, అరాచక పాలన సాగుతోందని, కేసీఆర్ నోటికి హద్దు లేదు.
నోరు తాటి మట్ట కంటే అధ్వాన్నం అని ఆయన అన్నారు. బీజేపీ దెబ్బకి భయపడి ఫామ్ హౌజ్ నుండి బయటకొస్తుండు. మళ్లీ హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైండు అని ఆయన అన్నారు.
నేనొక్కటే అడుగుతున్నా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని 7 ఏళ్ల నుండి చెబుతున్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేసిండు? లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయ్. ఉద్యోగాల్లేక యువకులు అల్లాడిపోతుండ్రు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అవసరమైతే ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ నుండి గుంజుకొచ్చి హామీలన్నీ అమలయ్యేలా ఉద్యమిస్తామని ఆయన అన్నారు.