అటు పార్టీ పదవి, ఇటు ప్రభుత్వ సలహాదారుడి పదవి లో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తే గౌరవంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాలను కూడా చూడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను ఈ నెల 6వ తేదీన లేఖ రాశానని, అయితే దాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని కె.రఘురామకృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ నియామకంపై నిన్న ఏపి హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయం కూడా చర్చకు వచ్చింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వారు రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. సలహాదారుల నియామక విధి విధానాలపై కోర్టుకు వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ విషయాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో వివరంగా వచ్చాయని రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ రెండు పత్రికలూ ముఖ్యమంత్రి చదివే అవకాశం లేదు, సాక్ష పత్రిక ఇలాంటి విషయాలు ప్రచురించే అవకాశం లేదు కాబట్టి తాను లేఖ ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నానని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
కేసులో తదుపరి విచారణ ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేసినందున ఈలోపునే సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో ఒక పదవికి పరిమితం చేయాలని ఆయన సూచించారు. అలా చేస్తే ముఖ్యమంత్రికి గౌరవం దక్కుతుందని, లేకపోతే ఈ అంశం ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలలో మరో ముఖ్య అంశం అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.