పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో కనీవినీ ఎరగని రీతిలో బ్యాంకు చోరీ జరిగింది. ఇటీవల హత్యకు గురైన హైకోర్ట్ లాయర్ వామన రావు సొంత గ్రామంగా గుంజపడుగు వార్తల్లోకి ఎక్కింది. వామన్ రావు హత్య తర్వాత హైకోర్ట్ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో ఒక పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు.
పోలీస్ పికెట్ సమీపంలోనే ఈ బ్యాంకు చోరీ జరిగింది. అక్కడి ఎస్ బి ఐ నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను, నగదును దొంగలు దోచుకెళ్లారు. మొత్తం రూ. 3.10 కోట్లు విలువైన సొత్తును అపహహరించారు. అర్ధరాత్రి దాటిన తరువాత భారీ చోరీ జరిగింది.
దొంగలు బ్యాంకుకు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్ తీసేశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో లాకర్ బద్దలు కొట్టి, అందులోని రూ. 18.46 లక్షల నగదుతోపాటు రూ. 2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు.
అంతేగాక, చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డైన సీసీ ఫుటేజీ డీవీఆర్ బాక్స్ను కూడా దొంగలు వెంట తీసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వేలిముద్రలు కూడా దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకుని దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు.
ఈ కేసును సవాలుగా తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల కోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.