ఖమ్మం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతివనం అందంగా ముస్తాబైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని అభివృద్ధికి కృషి చేశారు. ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారి సమీపంలో మొత్తం 14 ఎకరాలు కేటాయించారు. సుడా నుంచి రూ.కోటితోపాటు, ఉపాధి హామీ పథకం నుంచి రూ.16లక్షలు, రఘునాథపాలెం గ్రామ పంచాయతీ నుంచి సుమారు రూ.40లక్షల నిధులను అభివృద్ధికి కేటాయించారు. దీనిలో ఉన్న సుమారు 6 ఎకరాల్లోని చెరువును మినీ ట్యాంకుబండ్గా అభివృద్ధి చేశారు. మిగిలిన 8 ఎకరాల్లో అందంగా మొక్కలు నాటించారు.
పిల్లలను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తల్లీబిడ్డతోపాటు, ఫౌంటెన్ వద్ద ఆకాశాన్ని చూస్తున్న చేయిపై పక్షి వాలుతున్నట్లు తీర్చిదిద్దిన బొమ్మ, నెమళ్లు, చిన్నచిన్న పక్షలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రాత్రి వేళ సైతం ప్రకాశంగా కనిపించేలా విద్యుత్తు వసతి కల్పించి 20 వీధి దీపాలు, ఒక హైమాస్ట్ దీపాన్ని ఏర్పాటు చేశారు. వనంలో ఇప్పటి వరకు 20వేల మొక్కలు నాటించిన అధికారులు, ప్రతి మొక్కకు నీరందించేలా బిందు సేద్యం పైపులు ఏర్పాటు చేశారు.