అనంతపురం జిల్లాలో ప్రతి అర్హులైన పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. గౌతమి పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని చెప్పారు. జిల్లాపై అవగాహన ఉందని, అయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. అనంతపురం జిల్లా పరిధిలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, ఆయా అధికారులతో సమీక్షలు నిర్వహించి భూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. భూముల ధరలు పెరగడం ద్వారా అలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదన్నారు. తాను ఆర్డీవో గా అనంతపురంలో పనిచేశానని అప్పట్లో అధికారులు, ఉద్యోగులు సంపూర్ణంగా సహకరించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా వారిని సమన్వయం చేసుకుని జిల్లా సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచను లేకుండా పాటుపడతానని ప్రకటించారు.
తాను ఆర్డీవో గా పనిచేసే నాటికి.. నేటికీ ప్రభుత్వ ప్రాధాన్యతలు పెరిగాయని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు నేడు వంటి అభివృద్ధి కార్యక్రమాలు అదనంగా ఉండడం ద్వారా జిల్లా అధికారిగా తన బాధ్యత పెరిగిందన్నారు. రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో కలెక్టర్ గా తన బాధ్యతను అన్ని విధాల బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ గౌతమి స్పష్టం చేశారు.