ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగగిరి నందు జరిగిన సమావేశంలో కోటాచలం మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో,అంగన్వాడీ కేంద్రాల్లో,రేషన్ డీలర్ల వద్ద లక్షా ఎనభై రెండు వేల ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు గూర్చి వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నటు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైనటువంటి మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రజలు ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలని,ఒకవేళ ఎండలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తలపై తెల్లని టోపీని,తల రుమాలును ధరించాలని ప్రతికూల పరిస్థితుల్లో 108 వాహనాన్ని ఉపయోగించుకుని అందుబాటులో ఉన్నా ఆరోగ్య కేంద్రానికి చేరి చికిత్స పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్,జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్,సిసి భాస్కర రాజు,ఇందిరాల రామకృష్ణ,ఉదయగిరి శ్రీనివాస్,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్