తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదన తక్షణమే నిలిపివేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో జగన్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరిస్తున్నదని, ఏ అంశంలోనూ పారదర్శకత ఉండటం లేదని ఆయన అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాలు భక్తుల కానుకలతో నడిచే ధార్మిక క్షేత్రాలు. అలాంటి కానుకలతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చారని, ఇలా కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వడమే తప్పు అని ఆయన అన్నారు. నెలకు 21 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం గత ఏడాది కాలంగా చెల్లించడం లేదని ఆయన అన్నారు. అద్దె చెల్లించడం మాట అటుంచి పద్మావతి నిలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నదని చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయలు చెల్లించి స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వంతో టీటీడీ పెద్దలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని ఆయన అన్నారు.
అసలు ఈ ప్రతిపాదనను ఎవరు చేశారు? ఎవరు ఆమోదించారు? అని ఆయన ప్రశ్నించారు. దీని వెనకనుండి ఎవరు కథనడిపించారో బయటకు రావాల్సి ఉందని ఆయన అన్నారు. ధార్మిక మండలి లో తీసుకునే నిర్ణయాలు గతంలో టీటీడీ వెబ్ సైట్ లో పొందుపరిచేవారని అయితే ఇప్పుడు అలా చేయకుండా దొంగతనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ధార్మిక క్షేత్రాలలో దాపరికాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్, డాక్టర్ శ్రీహరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.