గోళ్ళ పాడు ఛానల్ పై చేపడుతున్న పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, మంచికంటినగర్, రంగనాయకులు గుట్ట వరకు కాలి నడకన పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ, సుందరీకరణ పనుల్లో భాగంగా పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకులు గుట్ట, సుందరయ్య పార్క్ ముందు, వెనుక భాగాలలో, దాల్ మిల్ వద్ద మొత్తం 5 పట్టణ ప్రకృతి వనాలు అభివృద్ధి పర్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి పార్కుల్లో పిల్లల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ లు, రెండు చోట్ల ఫౌంటెన్, గ్రీనరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పట్టణ క్రీడా ప్రాంగణాల్లో స్థానిక యువతకు ఆసక్తి గల క్రీడలకు సంబంధించి కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఫెన్సింగ్, లైట్లు, ఆకర్షణీయమైన పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నట్లు ఆయన అన్నారు. పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాద వాతావరణానికి, ఆరోగ్య పరిరక్షణకు పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుతోపాటు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ల ఏర్పాటు చేసినట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాయామం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని, దీనికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో కాలనీల్లోనే ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాల్వల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు, పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పార్కుల కిరువైపుల రహదారి నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. పనుల పూర్తితో ప్రాంతం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.