కరోనాకు వ్యాక్సీన్ రెడీ అవుతున్నది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనే కరోనా వ్యాక్సీన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది. భారత్ లో అభివృద్ది అవుతున్న మొదటి కరోనా వ్యాక్సిన్ ఇది. భారత్ బయోటెక్ తయారుచేస్తోన్న ఈ వ్యాక్సిన్ మొదటి దశ క్లీనికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకున్నది. రెండో దశ క్లీనికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సంయుక్తంగా ఈ వ్యాక్సీన్ ను రూపొందిస్తున్నాయి. సార్స్ సిఓవి 2 స్ట్రెన్ ను పూనేలోని ఎన్ఐవి వేరు చేసి భారత్ బయోటెక్ కు తదుపరి చర్యలకు అందచేసింది. బయో సేఫ్టీ లెవెల్ 3 స్టాండర్డ్స్ ప్రకారం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ఈ వ్యాక్సీన్ ను అభివృద్ధి పరచింది.
ఇమ్యూనిటీ రెస్పాన్స్ కు సంబంధించిన నివేదికలను భారత్ బయో టెక్ తమకు సమర్పించిందని, అవి సంతృప్తికరంగా ఉన్నందున హ్యూమన్ ట్రయల్స్ కు అనుమతి ఇస్తున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ప్రకటించారు. అతి త్వరలో తొలి దేశీయ వ్యాక్సిన్ రాబోతున్నదని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
ఇప్పటి వరకూ తాము నిర్వహించిన పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయన తెలిపారు. భారత్ బయో టెక్ ఇప్పటికే పోలియో, రాబిస్, రోటావైరస్, జపనీస్ ఎన్ సెఫెలైటీస్ (మెదడువాపు వ్యాధి) చికెన్ గున్యా, జికా లకు వ్యాక్సీన్ లు కనిపెట్టిన విషయం తెలిసిందే.