భవానీ దీక్షావిరమణ మహోత్సవాలు ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం లో అత్యంత వైభవముగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షావిరమణలలో మొదటి రోజు అయిన నేడు ఉదయం 8 గంటలకు శ్రీ అమ్మవారి దర్శనము ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఉదయం అగ్ని ప్రతిష్ఠాపన చేసి, హోమగుండం వెలిగించారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివ ప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఉదయం ప్రారంభించిన చండీయాగంలో ఆలయ ప్రధానార్చకులు లింగంబొట్ల దుర్గాప్రసాద్ పాల్గొని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
భక్తులు వినాయక గుడి నుండి ప్రారంభమయ్యే క్యూలైన్లు ద్వారా ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానము చేరుకొని, అమ్మవారిని దర్శించుకున్నారు. శివాలయము మెట్ల మార్గం ద్వారా క్రిందకి చేరుకుని, హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసిన ఇరుముడి పాయింట్లు వద్ద భక్తులు ఇరుముడులు సమర్పించి, ముడుపులు, కానుకలు సమర్పించుకుంటున్నారు. భవానీ దీక్ష విరమణల సందర్భంగా నేటి నుంచి దేవస్థానం లో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు దేవస్థానం తరుపున మాత్రమే నిర్వహిస్తారు.
భక్తుల సౌకర్యార్థం భక్తుల గోత్ర నామాపై పూజ జరిపించుకోవడానికి (పరోక్షముగా మాత్రమే) గాను దేవస్థానం వారు అన్ని ఆర్జిత సేవలు పరోక్ష సేవలుగా నిర్వహిస్తూ, www.aptemples.ap.gov.in ద్వారా అందుబాటులో ఉంచటము జరిగినది. పూజ జరిగిన అనంతరం సదరు సేవ ప్రసాదములు భక్తులకు పోస్ట్ ద్వారా భక్తుల అడ్రెస్స్ కు పంపుతారు. రేపటి నుండి ఉదయం 03 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించనున్నట్లు తెలిపారు.