మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్.ఎస్.సి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖాధికారులతో ఆయన సమీక్షించారు.
పరీక్షల నిర్వహణలో గత సంవత్సరం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్యకమిటీ సూచనలను ఈ రెండు శాఖలు అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అమలు చేయడం తో పాటు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి అదనపు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.
ప్రశ్నాపత్రాలు దిద్దేవారికి పూర్తి స్థాయి శిక్షణను అందించి గత సంవత్సరంలో సాధారణంగా జరిగిన తప్పులపై అవగాహన కల్పించి, ఏ ఒక్క విద్యార్ధి నష్ట పోకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యార్ధుల సౌకర్యార్ధం ఆన్ లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలుపుతూ జిల్లాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు.
అడ్మిషన్ నుండి తుది ఫలితాల వెల్లడి వరకు రెగ్యులర్ క్యాలెండర్ ను రూపొందించాలన్నారు. సి.జి.జి. రూపొందించిన వివిధ ఐ.టి.మాడ్యూళ్లను టెస్ట్ చేసి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుండి మార్చి 23 వరకు , పదవ తరగతి పరీక్షలు మార్చి 19 నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించాలన్నారు.
ఈ సారి ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల విద్యార్ధులు , పదవ తరగతి పరీక్షలకు 5.08 లక్షల విద్యార్ధులు హజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు, జంబ్లింగ్ పద్దతి, హల్ టికెట్ ల జారీ , ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.
ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమీషనర్ సయ్యద్ ఓమర్ జలీల్, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ విజయ్ కుమార్, సి.జి.జి. డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, టి.ఎస్. టెక్నలాజికల్ మేనెజింగ్ డైరెక్టర్ జి.టి.వేంకటేశ్వర్ రావు, ఎస్.ఎస్.సి బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.