శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల భవానీ మండల దీక్షలు మహాపూర్నాహుతి, కలశోద్వాసన తో నేటితో పరిసమాప్తం అయ్యాయి. ఈ పూర్ణాహుతి కార్యక్రమముతో భవానీ మండల దీక్షలు విజయవంతముగా ముగిశాయని, దీక్షా విరమణలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం సంతోషదాయకమని ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ వెల్లడించారు.
ఇంద్రకీలాద్రిపై నేటి ఉదయం 11 గంటలకు యాగశాలలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మహాపూర్నాహుతి నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన కలశోద్వాసన కార్యక్రమం లో వైదిక కమిటీ సభ్యులు లింగంభోట్ల దుర్గాప్రసాద్ దంపతుల వారు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు దంపతుల కూడా పాల్గొన్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ భవానీ దీక్షల సందర్భంగా జరిగిన అన్ని కార్యక్రమాలకు రెవిన్యూ, పొలీసు, మునిసిపల్, ఫైర్, దేవాదాయ శాఖ అధికారులు సహకరించారని తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం చేశారు. దేవస్థాన సిబ్బందికి, మీడియా వారికి కృతఙ్ఞతలు తెలిపారు.