ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తన కుటుంబలో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడంలేదని కడప జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కుటుంబంలోనే కరోనా పాజిటివ్ ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగిన అనుయాయులు, అధికారులు మీడియా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఢిల్లీ పర్యటన ఓ చిదంబర రహస్యంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల డిప్యూటీ సీఎం బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని, కరోనా విషయంపైనా, ఢిల్లీ పర్యటన పైనా మీడియా ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రభాకర్ ప్రశ్నించారు.
జిల్లాలో 15 మందికి కరోనా పాజిటివ్ రావడం పై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా విషయంలో గోప్యంగా వ్యవహరించడం తగదని ఆయన అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తికి కారణమైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.