అర్ధ రాత్రి వరకూ ప్రజలతో మందు తాగించే కార్యక్రమాన్ని మానుకుని బిజెపికి సలహాలు ఇవ్వాలని బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హితవు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనపై తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావద్దని ఆయన కోరారు.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మద్యం వాడకాన్ని ప్రోత్సహించదు, అది ఆరోగ్యానికి హానికరం. ప్రతి రాష్ట్రం మద్యాన్ని నిషేధించాలి అని ఆయన అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న మీ స్నేహితులను (వైయస్ఆర్ పార్టీ) నేను మీ ద్వారా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ప్రజల సంక్షేమాన్ని కోరి, మీరు నిజంగా మధ్య నిషేధానికి కట్టుబడి ఉంటే, నిషేధం సాకుతో ఇలా అమాంత ధరలు పెంచే బదులు, గుజరాత్ లో లాగా ఒకేసారి మద్య నిషేధం ఎందుకు చేయకూడదు?’’ అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి తప్ప పేద ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు.
అంతేకాకుండా, మద్యానికి బానిసైన వాడు పెరిగిన ధరల గురించి పట్టించుకోవడం మానేసి, ఎలా కొనాలా అని ఆలోచిస్తాడు, చివరకు ఎలాగోలా కొని తీరుతాడు. మద్యం ధరల పెంపుదల స్మగ్లింగ్ వంటి అనేక నేరాల పెరుగుదలకు, పోలీసు వ్యవస్థలో అవినీతి పెరుగుదలకు కూడా కారణమవుతుంది అని ఆయన అన్నారు.
తాము మద్యాన్ని ప్రోత్సహించడం లేదని, మద్యం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఎందుకంటే పెరిగిన ధరలతో పేదవారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి వరకు మందు తాగించే మీ రాష్ట్రంలో మద్యం పాలసీని మార్చుకోండి అంటూ ఆయన కేటీఆర్ కు సలహా ఇచ్చారు.