మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యమని తెలిసి ఓటమిని జీర్ణించుకోలేక, ఓటమి భయంతోనే టిఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడికి పాల్పడ్డారని కామారెడ్డి పట్టణ బీజేపీ నాయకులు అన్నారు. మునుగోడు ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మునుగోడులో టిఆర్ఎస్ ఓటమి చెందుతుందని భావించి బీజేపీ గెలుపును ఓర్వలేకనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నిక ఏదైనా బీజేపీదే గెలుపు అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు బీజేపీ బెదరదని తెలిపారు. బీజేపీని ఎదుర్కోలేక రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఓటమికి బాధ్యత వహిస్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసినట్టుగా ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్, బీజేవైఎం నాయకులు నరేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.