పసుపులో సిండికేట్ దోపిడి ఉందని దాన్ని అరికడితే తప్ప రైతుకు లాభాలు రావని రాష్ట్రమంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 1.33 లక్షల ఎకరాలలో రూ.1687 కోట్ల విలువైన 2.81 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతున్నదని వారు తెలిపారు. పసుపులో కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టాలని పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రులకు సూచించారు.
పసుపు నాణ్యత పెంపు, మార్కెటింగ్, వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళిక, మద్దతు ధరలపై ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశం నేడు జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పసుపు మార్కెటింగ్ లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు అభిప్రాయపడ్డారు. పసుపు లేని వంట ఉండదు. కానీ రైతులకు మద్దతు ధర లేదు. అనాదిగా ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిదర్శనం అని మంత్రులు విమర్శించారు.
అలెప్పీ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, అదే రకాన్ని ఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందించినా కేంద్రం సహకారం లేకపోవడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదని వారు అభిప్రాయపడ్డారు. పసుపులో కర్క్ మెన్ శాతం పెంచితే ఎగుమతులు పెరిగి మద్దతు ధర లభిస్తుంది.
ప్రపంచంలో పసుపు వాడకం తక్కువ. కలర్స్, ఫార్మా రంగాలలో దీని వినియోగం పెంచితే బాగుంటుంది. పీపీపీ మోడల్ లో పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించాలి. పతంజలి లాంటి సంస్థలకు వసతులు కల్పిస్తే మన పసుపును పూర్తిగా వారే కొంటారేమో ప్రయత్నాలు చేయాలి అని సమావేశం అభిప్రాయపడింది.
దీర్ఘకాలిక ప్రణాళికతో ఏం చేయగలం ? స్వల్పకాలికంగా రైతులకు ఏం చేయగలం ? అనే అంశంపై కమిటీ నియమించి నివేదిక వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్దామని సమావేశం నిర్ణయించింది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, జీవన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రాంరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయుష్, ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు.