సీఎం జగన్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. సాయంత్రం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయా డివిజన్లనుంచి , వీధుల నుంచి పెద్ద ఎత్తున యువతను రక్తదాన శిబిరానికి తీసుకురావాలని, తద్వారా శిబిరాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యువజన, విద్యార్థి విభాగాలు కృషి చేయాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనతో పాటు, ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో ముందంజలో ఉన్నామని తెలిపారు.
గత పాలకులు సగంలో ఆపేసిన బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు , స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు రహదారులు పూర్తి చేస్తున్నామని అన్నారు. అలాగే రైల్వే స్టేషన్ రోడ్డును కూడా ఆధునికరించామని తెలిపారు. శత శంకుస్థాపనలు, ద్విశ త శంకుస్థాపనల ద్వారా ఆయా డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
పార్టీ బలోపేతం అయ్యేది కార్యకర్తల వల్లేనని, కష్టించి పనిచేస్తే పార్టీ ప్రజల్లో ఉంటుందని అన్నారు. అర్ధరాత్రి అయిన తాను ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే అందుబాటులోనే ఉంటానని అన్నారు. యువజన విద్యార్థి విభాగాలు పార్టీ కోసం కొంత సమయం కేటాయించాలని, దానివల్ల సమాజంలో గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశం ఉందన్నారు. పార్టీ విజయానికి, తన గెలుపునకు పార్టీతో పాటు కార్యకర్తలు, ప్రజలే తన బలమని అన్నారు.
నీతిగా, నిజాయితీగా పరిపాలన చేస్తూ కార్యకర్తలు గర్వంగా తలెత్తుకునే విధంగా తన ప్రవర్తన ఉంటుందన్నారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతిరాజు తన బంగ్లా గేటుకు తాళం వేసుకుంటే, బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా తాను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు వచ్చి ప్రజలకు అండగా ఉంటూ, భరోసా కల్పించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. దానికి నిదర్శనమే జరిగిన నగరపాలక ఎన్నికలలో 50 స్థానాలకు గాను 48 స్థానాలలో ప్రజలు విజయం అందించారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ , మూడు సంవత్సరాల ఆరు నెలల కాలంలో చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చి ఆదరణ చూపెడుతున్నారని అన్నారు. చేసిన మంచి పనులకు ప్రజల హృదయాలే సాక్ష్యమని అన్నారు.
నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు అల్లు చాణక్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, యువజన విద్యార్థి విభాగాల నాయకులు బోడసింగి ఈశ్వరరావు, జీవి రంగారావు, జై శంకర్ లు మాట్లాడుతూ ఈనెల 21న ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించుకొని యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని, ప్రతి డివిజన్ నుంచి పదిమంది రక్తదాతలను తీసుకురావాలని అన్నారు. పార్టీకి యువత, విద్యార్థి విభాగాలే కీలకమని అన్నారు.
యువతకు, విద్యార్థులకు సీఎం జగన్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామీలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు. యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తృప్తి కొట్టాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత, విద్యార్థి విభాగాల పైన కూడా ఉందన్నారు.
రాబోయే ఎన్నికలలో యువత, విద్యార్థి విభాగాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన గృహ సారధులలో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో విజయనగరం లో ఆయా డివిజన్ ల నుంచి యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.