రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల నియమావళిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఏపీ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, బాలాజీ భక్త బృందం విమర్శించాయి. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్, ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, బృందావనం రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ “తిరుమలను మీ అమ్మ మొగుడు కట్టించాడా” అంటూ రాష్ట్ర మంత్రి హోదాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశ్వాసాలను నియమావళిని దేవాలయ సాంప్రదాయాలను అత్యంత నీచంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ కు ఎక్కడికైనా వెళ్లే హక్కుంది, అన్యమత డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి సంతకం చేయడు అనడం కరెక్టు కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవస్థానం కాదని అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయం అని రాష్ట్ర మంత్రి కి తెలియకపోవటం విడ్డూరంగా ఉందని వారన్నారు. కొడాలి నాని ఈ రాష్ట్రానికి మంత్రిగా మహాఉంటే రెండు సంవత్సరాలు ఉంటాడని, ఈ రెండు సంవత్సరాలకే ఇంత మిడిసిపాటా అని వారు ప్రశ్నించారు. ఒక రాష్ట్రమంత్రి అయివుండి కలియుగదైవం పట్ల అంతా కండకావరం గా అహంకార పూరితంగా మాట్లాడి భక్తుల మనోభావాలను తీశారని వారన్నారు.
ఈ దేశ రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కన్నా గొప్ప వ్యక్తులు ఏం కాదని, సాక్షాత్తు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, విదేశీ అధ్యక్ష ప్రధానులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు స్వామివారి పట్ల తమకు విశ్వాసం ఉందని, అక్కడ ఉన్న డిక్లరేషన్ పుస్తకంలో స్వయంగా సంతకాలు చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్లే వారిని వారు తెలిపారు.
స్వామివారిని విశ్వసించ కుండా పూజలు చేయించుకోవటం మహా అపచారం అని దాన్ని సమర్థిస్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానితో “దేవస్థానాన్ని ఎవడు అమ్మ మొగుడు కట్టించాడు” అని అనిపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలను ఒక పథకం ప్రకారం కుట్రతో దెబ్బతీయడమేనని వారన్నారు. ప్రభుత్వం అవలంబించే ఈ విధానాలకు స్వామి వారి ఆధ్వర్యంలో దుష్టశిక్షణ తప్పక జరిగి తీరుతుందని హెచ్చరించారు. చేస్తున్న తప్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ధర్మ పరిరక్షణ కొరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల వేంకట రామలింగేశ్వర శాస్త్రి, బృందావనం రాధాకృష్ణ మూర్తి, దండిభోట్ల శ్రీనివాస్, ఐలూరి శ్రీనివాస శర్మ, వేదాంతం లక్ష్మణా చార్యులు, పెద్దింటి ఫణి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.