ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి జరిగిన తీవ్ర అన్యాయం పై తెలుగు దేశం పార్టీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నిర్వహణలో చలో విజయ వాడ కార్యక్రమం నిర్వహించి బ్రాహ్మణ కార్పొరేషన్ ను ముట్టడించనున్నట్లు రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తెలిపారు.
కడప నగరంలోని ఓం శాంతినగర్ లోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భారత దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రప్రథమంగా లోక కల్యాణం కోసం పనిచేసే బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయడం తో పాటు బ్రాహ్మణ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీని అధ్వాన్నంగా తయారు చేశారన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని వైసీపీ ఎన్నికలకు ముందు తన మానిఫెస్టో లో పేర్కొని బ్రాహ్మణుల ఓట్లను కొల్లగొట్టిందన్నారు. ఎన్నికల అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయకుండా బడ్జెట్ లో కేటాయించే అరకొర నిధులను సైతం ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్ళించి బ్రాహ్మణులకు రిక్తహస్తం మిగిల్చారన్నారు.
అలాగే కార్పొరేషన్ పెన్షన్లు రద్దు చేసి నిరుపేద బ్రాహ్మణులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్త్తున్న ఆర్ధిక సహాయం కూడా నిలిపి వేశారన్నారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమం కోసం తెలుగు దేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసినందుకు నిరసనగా పథకాల పురుద్ధరణ కోసం, బ్రాహ్మణ కార్పొరేషన్ కు వైసీపీ మానిఫెస్టో లో చెప్పిన ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలతో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులతో కలిసి విజయవాడ గొల్లపూడిలోని కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా, నిరసన ప్రదర్శన, కార్పొరేషన్ ఎదుట వంటావార్పు నిర్వహించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని బ్రాహ్మణులు అందరు రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా కదిలి రావాలని సాయినాథ్ శర్మ పిలుపునిచ్చారు. సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ జిల్లా కోఆర్డినేటర్ జనార్ధన్ పాల్గొన్నారు.