రాజ్యాంగంపై ప్రమాణం చేసి మరచిపోయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, విలువలు పాటించని నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా రాజ్యాంగ పదవులకు పనికిరారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.
చిత్తూరు, గుంటూరు జిల్లాలలోని పంచాయతీలలో బలవంతపు ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగినందున ఎన్నికల ధ్రువీకరణను ఎన్నికల కమీషనరు నిమ్మగడ్డ రమేష్ నిలుపుదల చేసారు. దీనిని జీర్ణించుకోలేని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కమీషనర్ ఆదేశాలు అమలు చేసిన కలెక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతానని బెదిరించారు.
అలాగే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా నిమ్మగడ్డ చిన్న మెదడు చితికిపోయిందని వ్యాఖ్యానించారు. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన పెడ్డిరెడ్డి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించడం తప్పు. కాబట్టి ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.
అలాగే రోజాను కూడా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి అని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ఈ ఇద్దరు రాజ్యారంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున పదవులలో ఉండడానికి పనికిరారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 517 పంచాయతీలు ఏకగ్రీవం కాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110, గుంటూరులో 67 ఏకగ్రీవాలు ఎలాజరిగాయో ఆ ఇద్దరు చెప్పాలని ఆయన అన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలు, ఇతర అక్రమ మార్గాలలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్న విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.