కామారెడ్డి మండల సమావేశంలో అధికార పార్టీ సర్పంచులు నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీకి చెందిన నేతలే సమావేశంలో నేలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. కామారెడ్డి మండల కార్యాలయంలో నేడు మండల స్థాయి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులు నిరసన తెలిపారు.
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే 15 వ ఫైనాన్స్, ఎస్.ఎఫ్.సి నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అవుతున్నాయని, వాటిని సంబంధిత అధికారులు పంచాయతీ అవసరాలకు కేటాయించకుండా కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ కిస్తీలు అంటూ నిధులను మళ్లిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సర్పంచులు ఆరోపించారు. గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో సిబ్బందికి జీతాలు చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోతే పనులు ఎలా చేయించాలని నిలదీశారు. ఈ విషయమై స్పందించిన ఎంపీపీ సమస్య పరిష్కరమయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో సర్పంచులు శాంతించారు. అనంతరం ఏజండా అంశాలపై చర్చ కొనసాగించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ ఉరుదొండ నరేష్, ఎంపీడీవో శంకర్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.