మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “సంయుక్త కిసాన్మోర్చా” ఇచ్చిన పిలుపు మేరకు, దేశవ్యాప్తంగా భారత్ బందులో కడప జిల్లా రాజంపేటలో బంద్ నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ నగర సరిహద్దులలో గత 300 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్న కూడా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోనందుకు నిరసనగా, 550 కార్మిక సంఘాలతో కూడిన ఈ బంద్ లో వామపక్షాలు,కాంగ్రెస్,తెలుగుదేశం అఖిలపక్ష రాజకీయ పక్షాలు కార్మిక సంఘాల రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు అన్నింటిని మూసి వేయించి బంద్ ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయించారు. ఆర్.అండ్.బి బంగాళా నుంచి బైపాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ చేశారు. అలాగే బైపాస్ రోడ్డు లో బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు నిరసన కారుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణలు బిల్లును రద్దు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.