త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి 27 నెలలు పూర్తవుతోంది. ఇప్పటికే 150 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారని తెలిసింది.
ఈ నివేదికలు సిద్ధం కాగానే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలకు సీఎం సమయం కేటాయించనున్నారు. ఇదంతా మంత్రి వర్గ విస్తరణ కోసం కసరత్తేనని అంటున్నారు. ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఇందుకు సంబంధించి ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. ఒన్ టు ఒన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారు.
ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు..పని తీరు బాగున్న వారికి దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం – ఎమ్మెల్యేల ఒన్ టు ఒన సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు- మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారు.
ఇదంతా కేబినెట్ విస్తరణలో భాగంగా చేపడుతున్న కసరత్తుగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయం లో ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది.
కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది.
ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక, మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది.