ఏపీలోని విశాఖ రేంజ్ లోని మూడు జిల్లాల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జిల్లాలలోని కొందరు ప్రజలు తమ బాధ్యతను, సంరక్షణను విస్మరిస్తున్నారని రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. మాస్క్ లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా సంచరిస్తున్నారని డీఐజీ అన్నారు.
తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్నిదృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రేంజ్ డీఐజీ కోరారు. కొందరు వాహనదారులు, ప్రజలు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కు కట్టుకోకుండా అలంకారప్రాయంగా తగిలించుకోవడం కరోనా మహమ్మారిని ఆహ్వానించడమే అని అన్నారు. లాక్ డౌన్ లో ప్రజలేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలను టీకా వచ్చేంతవరకు పాటించాలని డీఐజీ కోరారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఖచ్చితంగా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ మాస్క్ లు ధరించి మాట్లాడాలని సూచించారు. షాపింగ్ మాల్స్ లలో, కుటుంబ వేడుకలలో, సమూహాలలో ఉన్నప్పుడూ మరింత జాగ్రతలు పాటించాలన్నారు.
ప్రతీ సోమవారం ఫోన్ ఇన్..
విశాఖ డీఐజీతో ప్రతి సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని డీఐజీ ఆఫీసు పేర్కొంది. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగు ణంగా ప్రజలకు మరింత చేరువకావడం కోసం పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ప్రతి సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి 12:30 వరకు రేంజ్ పరిధిలో ఉన్న మూడు జిల్లాల ప్రజలు స్పందనలో భాగంగా ఫోన్ ఇన్ ఉంటుందని పేర్కొంది.
విశాఖ డీఐజీ కార్యాలయంలో 0891 – 2754535 ఫోన్ చేసి తమ సమస్యలను రేంజ్ డీఐజీ కి విన్నవించుకోవచ్చని పేర్కొంది. అవినీతి రహిత సేవలు అందించడానికి పోలీసు వ్యవస్థ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని పోలీసు సేవలలో ఫిర్యాదు దారునికి న్యాయం జరగలేదని భావించినప్పుడు, దర్యాప్తు విషయంలో పోలీసులు సరిగా స్పంధించలేదని భావించినా, లేదా అవినీతి ఆరోపణలు పైనా ఫోన్ ద్వారా పై నిర్ణయించిన సమయంలో సంప్రధించవచ్చని తెలిపింది.
ఈ మూడు జిల్లాలో పరిధిలో దూర ప్రాంతాల వారు సైతం తమ సమస్యలపై మాట్లాడవచ్చన్నారు. అలాగే కోర్ట్ లో ఉన్న వివాదాలు, ఆస్తి తగాదాలు (సివిల్) మొదలైన వివాదాలు పోలీసుల పరిధిలో ఉండవని తెలియజేశారు.