ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేసి తీరాల్సిందేనని సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది. తాను పిటిషన్ వేయకపోయినా దస్తగిరి వేసిన పిటిషన్ ను పూర్తి స్థాయిలో సమర్థించింది. అంతే కాదు సాక్షులను బెదింరించడానికి ఆధారాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది.
ఏ నేరంలో అయినా బెయిల్ ఇచ్చేటప్పుడు మొదటి షరతు సాక్షులను ప్రభావితం చేయకూడదనే. అవినాష్ రెడ్డి అదే చేశాడని సీబీఐ వాదించడంతో ఆయన బెయిల్ రద్దు చేయకుండా ఉండటానికి కారణాలేమీ కనిపించని పరిస్థితి ఉందని న్యాయనిపుణులు అంచనా వస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు .. నిందితులు అందర్నీ అరెస్టు చేసినా ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై వస్తున్న విమర్శలు .. సీబీఐని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టులో సీబీఐ వాదన అవినాష్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించి ఉండవచ్చు.
దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారుల్ని టార్చర్ పెట్టి .. వారిపై కేసులు పెట్టిన ఘనత ఉన్న వైఎస్ బ్రదర్స్ కు సీబీఐ ఇక ఏ మాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు ఉన్నా… వైఎస్ అవినాష్ రెడ్డికే కడప టిక్కెట్ ను జగన్ ప్రకటించారు. నామినేషన్ల గడువు ఈ నెల 18నుంచి ప్రారంభమవుతుంది. అవినాష్ బెయిల్ రద్దుపై తదుపరి విచారణ 15వ తేదీన జరుగుతుంది.
ఆయన బెయిల్ రద్దు చేస్తే.. నామినేషన్ల కంటే ముందే జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఆయనను పక్కన పెట్టుకుని వివేకా హత్య ఎవరు చేశారో.. జనానికి దేవుడికి తెలుసుంటూ.. నంగి నంగి కబుర్లు చెప్పిన జగన్కు అప్పుడు మా తమ్ముడ్ని అరెస్టు చేశారంటూ సానుభూతి రాజకీయం చేసుకునే అవకాశం వస్తుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్ ను కోర్టుకు సమర్పించింది సీబీఐ, ఈ ఏడాది జూన్ 30వ తేదీన చార్జీషీట్ ను అందించింది సీబీఐ. 140 పేజీలతో చార్జీషీట్ ఉంది. సెకండ్ సప్లిమెంటరీ ఫైనల్ చార్జీషీట్ గా సీబీఐ తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎ-8 నిందితుడిగా సీబీఐ పేర్కొంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 14న పులివెందులలో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తున్నది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ హత్య కేసును విచారించేందుకు చంద్రబాబు సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ కూడ మరో సిట్ ను ఏర్పాటు చేసింది.
ఈ హత్య కేసును సీబీఐతో విచారించాలని వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి, టీడీపీ నేత బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ లో ఎనిమిదో నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఈ ఏడాది ఆగస్టు 14న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. అయితే ఈ ముందస్తు బెయిల్ ను వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ పై ఈ నెల 18న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఇదే సమయంలో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 8వ నిందితుడైన అవినాష్ రెడ్డి కడప ఎంపిగా ఉన్నారని, ఆయన ముఖ్యమంత్రికి సోదరుడు కావడంతో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని దస్తగిరి భావించాడు. దాంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వేడుకుంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై సీబీఐ సమాధానం దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి అత్యంత పలుకుబడికలిగిన వ్యక్తి అని అందువల్ల సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, ఈ కారణంగా తక్షణమే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోరింది. ఇప్పుడు ఈ అంశం ఆసక్తికరంగా మారింది.