రాజధాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీ వీ ఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. తగిన సమయంలో బిజెపి జోక్యం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంతకాలం చెబుతూ వచ్చారు.
కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీలుందని ఇంత కాలం ఆయన రాజధాని ప్రాంత రైతులకు ఎన్నో ఆశలు కల్పించారు. ఇటీవల బిజెపితో చేతులు కలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధానిని కాపాడేందుకే బిజెపితో చేతులు కలుపుతున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేవరకూ నిద్రపోనని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బిజెపిలో అతి ముఖ్యమైన నాయకుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు అయిన రాజ్యసభ సభ్యుడు జీ వీ ఎల్ నరసింహారావు రాజధాని విషయంలో క్లారిటీ ఇవ్వడం విశేషం.
రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. రేపు బిజెపి జనసేన మధ్య జరిగే సమావేశం రాజధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిర్దేశించినదని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు కూడా కరెక్టు కాదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునేది లేదని ఆయన అన్నారు.