టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా?
వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు’ అని ప్రశ్నించారు. తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్, బిహార్లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు.
‘వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి.
ఇంత జరుగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లయినాలేదు అని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.