భారతీయ శిక్షాస్మృతిలో ప్రత్యేక సెక్షన్లు లేకపోవడం వల్ల ట్రాన్స్ జెండర్స్ పై జరుగుతున్న అత్యాచారాల కేసులు నమోదు చేయడం లేదని అందుకోసం ఐపిసిని సవరించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏ ఎస్ బొపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్న బెంచ్ ట్రాన్స్ జెండర్లపై జరుగుతున్న అత్యాచారాల లెక్కలను కోరింది. ఐపిసిలో మగవారిపైనా, ఆడవారిపైనా జరిగే లైంగిక దాడులకు మాత్రమే ఐపిసిలో సెక్షన్లు ఉన్నాయి.
ట్రాన్స్ జెండర్లపై లైంగిక అత్యాచారం జరిగితే అందుకు సంబంధించిన సెక్షన్లు లేకపోవడం వల్ల పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
354 ఏ అధికరణలోని ఏ సబ్ సెక్షన్ లో కూడా ఆడవారు, మగవారు ప్రస్తావన తప్ప ట్రాన్స్ జెండర్ల ప్రస్తావన లేదని ఆయన తెలిపారు.
ట్రాన్ జెండర్లపై కొన్ని సందర్భాలలో మగవారు, మరి కొన్ని సందర్భాలలో ఆడవారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఐపిసిలో మార్పులు చేయాలని ఆయన కోరారు.