శంకరాచార్యులు వారు చెప్పిన ‘గజం మిథ్య – పలాయనం మిథ్య’ కథలా ‘కోడి కత్తి మిథ్య- కోడి కత్తి కేసు మిథ్య’ అని తేలిపోయిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. కోడికత్తి కేసుతో సానుభూతి సంపాదించి రాజ్యాధికారం పొందిన సీఎం జగన్ ఇప్పటికైనా ‘‘డ్రామా’’ లో నిజాలను ఒప్పుకోవాలని, 52 నెలలుగా జైలులో మగ్గుతున్న అభం శుభం తెలియని దళిత బిడ్డ జనపల్లి శ్రీనివాసరావుపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబిడ్డకు క్షమాపణ చెప్పి, ఛిద్రమైపోయిన అతని జీవితానికి పరిహారం చెల్లించి, బేషరతుగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాకు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కేవలం రాజ్యాధికార దాహంతో జరగని దానిని జరిగినట్లుగా ప్రజల్ని నమ్మించి, కోడి కత్తి కేసును సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందారని, తద్వారా అధికారంలోకి కూడా వచ్చారని ఆయన అన్నారు. కోడి కత్తి కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర కోణం లేదని, నిందితుడికి ఏ రాజకీయ పార్టీ తో సంబంధం లేదని కోర్టుకు కేసును నాలుగేళ్లుగా విచారిస్తున్న ఎన్ఐఏ తెలపడం సంతోషమని ఆయన అన్నారు. దళితుడు, పేదకుటుంబానికి చెందిన యువకుడు, ఎలాంటి ఆసరాలేని వ్యక్తి అని తెలుసుకుని ఈ కుట్రలో శ్రీను బలిపశువును చేయడం తీవ్ర ఆక్షేపణీయమని బాలకోటయ్య అన్నారు.
రాజ్యాధికారం పొందడం కోసం దళితుడిని అమానుషంగా జైలు పాలు చేసిన వారు ఇప్పటికైనా దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీను పై సీఎం జగన్ చేసిన అభియోగాలు అన్నీ అభూత కల్పనలుగా తేల్చిందని అన్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాలన్న సిఎం పిటీషన్ కొట్టి వేయాలని చెప్పటంలోనే కేసు డొల్లతనం బహిర్గతం అయ్యిందన్నారు. అమ్మవారి జాతరలో పులులను బలి ఇవ్వరు. మేకలను మాత్రమే బలి ఇస్తారు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటకు సాక్ష్యంగా శ్రీనివాసరావు జీవితాన్ని బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు శ్రీనివాస్ విడుదలకు కృషి చేయాలని కోరారు.